అది 1993లో నంగనల్లూర్ లో ఆంజనేయ స్వామీ దేవస్థానం ప్రారంభం చేస్తున్న సందర్భం. దేవాలయం నిర్మాణ పనులు త్వరితగతిన జరుగుతున్నాయి. చాలామంది భక్తులు కూడా వస్తున్నారు. ఒకరోజు నేను పరమాచార్య స్వామివారి ఆశిస్సుల కొరకు వెళ్లాను. స్వామికి సాష్టాంగం చేసి నమస్కరించాను. మహాస్వామివారు ఆశీర్వదించి నాతొ ఇలా అన్నారు, “ఇక్కడకు వచ్చే చాలా మంది భక్తుల ద్వారా విన్నాను దేవాలయానికి భక్తులు ఎక్కువగా వస్తున్నారు అని. చాలా పెద్ద విగ్రహం కదా స్వామివారి ఆకర్షణ శక్తి కూడా చాలా ఎక్కువగానే ఉన్నట్టుంది”.
నన్ను ఆశీర్వదించి ఎంతో వాత్సల్యంతో, “ఆయన చాలా పెద్ద స్వామీ కదా! మరి ఎక్కువ ప్రసాదం నివేదన చెయ్యాల్సి పడుతుంది కదా?” అని అడిగారు. నేను వెంటనే, “ఒక పెద్ద సంచి బియ్యాన్ని వండి నివేదన చేస్తున్నాము పెరియవ” అని బదులిచ్చాను.
“ఉత్తి అన్నం మాత్రమేనా?”
“లేదు పెరియవ చిత్రాన్నాలు వంటివి చేసి నివేదిస్తాము”
“నివేదనకు ఏమేమి తయారు చేస్తుంటారు?”
“ఉదయం నుండి చాలా రకాలు తయారు చేస్తుంటాము. వెణ్ పొంగల్, బెల్లం పొంగల్, పులిహోర, మిరియాల అన్నం, పెరుగన్నం అలా వరుసగా చేస్తుంటాము పెరియవ”
“మరి వీటికోసం చాలా మంది భక్తులు వస్తుంటారు కదా!”
కొంచం గర్వంతో, “ప్రతిరోజూ చాలా ఎక్కువ మంది భక్తులు వస్తారు. ప్రసాదాలు ఏవీ మిగలవు” అన్నాను.
మహాస్వామి వారు కొద్దిసేపు మౌనంగా ఉన్నారు. “ప్రసాదాలు కొద్ది కొద్దిగా ఇస్తారా, ఎక్కువ మొత్తంలో ఇస్తారా?” అని అడిగారు స్వామీ.
అతిశయించిన గర్వంతో, “ఒక పెద్ద ఆకులో ఎక్కువ ప్రసాదం ఇస్తాము పెరియవ” అని అన్నాను.
“ఇక్కడకు వచ్చే వారి వద్ద నేను ఈ విషయం విన్నాను. నిన్ను ఒక విషయం అడగదలచుకున్నాను. ప్రసాదాన్ని ప్రసాదం లాగా కొద్దిగా ఇవ్వాలా? లేక భిజనం లాగా ఎక్కువ ఇవ్వాలా?” అని ఆత్రుతతో అడిగారు.
ఏమని సమాధానం చెప్పాలో తెలియక నిలబడ్డాను.
మహాస్వామివారు నవ్వుతూ, “ఎందుకు అలా స్థాణువులా నిలబడిపోయావు? కేవలం నేను తెలుసుకోవడానికే నిన్ను ఈ ప్రశ్న అడుగుతున్నాను” అని అన్నారు.
కొద్దిగా సంశయిస్తూ వినయంగా, “లేదు పెరియవ. భక్తులు ఎంతో దూరం నుండి ఇక్కడకు వస్తారు. బహుశా వారికి ఆకలిగా ఉంటుంది కాబట్టి వారికి ఎక్కువ మొత్తంలో ప్రసాదాన్ని . . . ” అని ఇంకా నేను ముగించకుండానే, స్వామివారు “నువ్వు ఏమి ఆలోచిస్తున్నావో నాకు అర్థం అవుతుంది. కాని నా ఉద్దేశ్యం ప్రసాదాన్ని ప్రసాదం లాగా తక్కువ మోతాదులో ఇవ్వాలి. ఆకలిగొన్న వారిని కూర్చుండబెట్టి వేరేగా భోజనం పెట్టాలి” అని “మన వేదాలు, శాస్త్రాల్లో ఎన్నో చెయ్యవలసినవి, చెయ్యకూడనివి నిర్దేశించబడి ఉన్నాయి. కొన్ని కేవలం మన స్వియానుభావం వల్ల మాత్రమే అర్థం అవుతాయి” అని ఇతమిత్తంగా ఏమి చెప్పకపోవడంతో, అర్థం కాక, “నాకు ఈ విషయం అర్థం కాలేదు పెరియవ. ఏది సరైనది? ప్రసాదం కొంచం ఇవ్వాలా? ఎక్కువ ఇవ్వాలా? ఈ విషయంలో నాకు సహాయపడవలసింది” అని అడిగాను.
“లేదు, లేదు ఈ విషయంలో సరైనది ఏది అని నీకు అనుభవంలోకి వస్తుంది. అప్పటి దాకా ఓపికగా ఉండు” అని నన్ను ఆశీర్వదించి పంపారు.
ఇప్పుడు నేను పాండిచెర్రి నుండి దిండివనం వెళ్ళే దారిలో ఉన్న పంచవటిలో ఒక దేవాలయం నిర్మిస్తున్నాను. అది ముప్పైఆరు అడుగుల పంచముఖ ఆంజనేయ స్వామీ ఆలయం. నిర్మాణం పనులు జరుగుతున్నాయి ఇప్పుడు. ఇక్కడ కూడా పెద్ద ఆకుల్లో ఎక్కువ ప్రసాదం ఇవ్వడం ఆనవాయితీ. కొన్నిసార్లు నేనే యా ప్రసాద వితరణ చేస్తుంటాను. ఇటివల ఒకరోజు ఎప్పటిలాగే ఒక ఆకులో కదంబం (సాబారు అన్నం) మరొక ఆకులో పెరుగన్నం పెద్దమొత్తంలో ఇస్తున్నాము. అక్కడే కూర్చుని తింటున్న కొద్దిమంది నా వద్దకు వచ్చారు.
అందులో ఒకరు చాలా నిష్టూరంగా నాతో, “మీరు సాంబార్ అన్నం, పెరుగన్నం ఎక్కువ ఎక్కువ ఇస్తున్నారు బావుంది. రుచిగా కూడా ఉంది. కాని మీకు ఒక సలహా ఇవ్వాలి అని ఉంది. సాంబార్ అన్నానికి నంచుకోవడానికి పోరియల్, పెరుగన్నానికి తోడుగా కారం ఊరగాయ(ఆవకాయ) ఇస్తే బావుంటుంది”
ఆ మాటలు విని నేను నిశ్చేష్టుణ్ణి అయ్యాను. 1993లొ పరమాచార్య స్వామివారి మాటలు ఒక్కసారిగా గుర్తువచ్చాయి.
“లేదు, లేదు ఈ విషయంలో సరైనది ఏది అని నీకు అనుభవంలోకి వస్తుంది. అప్పటి దాకా ఓపికగా ఉండు”
స్వానుభవంతో ఇప్పుడు నాకు నిజం అవగతమైంది. ప్రసాదాన్ని ప్రసాదం లాగా కొద్దిగానే ఇవ్వాలి అని
--- శ్రీ రమణి అన్న, “మహా పెరియవర్” నుండి
#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం