Latest Posts from తెలుగు ఆధ్యాత్మిక పుస్తకాలు (@pusthakam123) on Telegram

తెలుగు ఆధ్యాత్మిక పుస్తకాలు Telegram Posts

తెలుగు ఆధ్యాత్మిక పుస్తకాలు
7,520 Subscribers
1,375 Photos
24 Videos
Last Updated 01.03.2025 08:17

The latest content shared by తెలుగు ఆధ్యాత్మిక పుస్తకాలు on Telegram


☘️🍁 ఆప్తవాక్యాలు 🍁☘️


133. వృక్షాణాం పతయే నమః

వృక్షాలకు పతి అయినవానికి నమస్కారం(రుద్రనమకం)

చెట్లంటే ప్రకృతిలో ప్రతి ప్రాణికి పరవశమే. వృక్షాలను దైవాలుగా భావించి ఆరాధించిన భవ్య సంస్కృతి మనది. మహోత్కృష్టమైన నాగరికత కలిగిన భరతవర్షం సనాతనంగా ఓషధుల విజ్ఞానాన్ని ఆవిష్కరించింది.
ప్రాచీన కాలంలోనే - వృక్షాలను
ప్రాణవంతాలుగా దర్శించిన విజ్ఞానం మనకుంది.

ప్రతి ఇంటా పెంచదగిన చెట్లను, మొక్కలను పెంచి పోషించాలని, అది
గృహస్థధర్మమని 'మహాభారతం'లో ఆనుశాసనికపర్వంలో భీష్ములవారి బోధ.పూలమొక్కలు, చెట్లు ఉన్న ఇంట మహాలక్ష్మి నివసిస్తుందని వివరించింది భారతం.తులసి మొక్కను తప్పనిసరిగా ఇంట్లో ఉంచి ఆరాధించడం మన సంప్రదాయం.
కొన్ని ప్రత్యేక మాసాలలో ప్రత్యేక వృక్షాల పూజలున్నాయి. అశ్వత్థ వృక్షానికి అర్చనలు,వటవృక్షానికి (వట సావిత్రీవ్రతం) ఆరాధనలు, శమీవృక్షానికి (విజయదశమినాడు)
పూజలు, ఉసిరికకు (కార్తికమాసంలో) మొక్కులు వంటివి మన ఆచారాలు. ప్రకృతికీ మనకీ దివ్య బంధముంది. భగవత్స్వరూపాన్ని చెట్టు, పుట్టలో కూడా దర్శించగలగడం గొప్ప సంస్కారం. దేవతా వృక్షాలుగా తలంచే చెట్లన్నీ ఔషధ విలువలతో కూడుకున్నవే.

విశ్వాన్నీ, జీవితాన్నీ కూడా వృక్షంతో పోల్చారు. బీజం ఏకమై, వృక్షం అనేకంగా కనిపిస్తుంది. విశ్వబీజమైన విశ్వమూలశక్తి భగవంతుడు విశ్వమనే వృక్షంగా విస్తరించాడు. మూలం కనిపించదు. భగవానుడూ గోచరించడు.

మనం పృథ్విపై ఉండి వర్ష, కాంతి, సస్యాది ఫలాలను అనుభవిస్తున్నాం. ఫలాలు దొరికే చోటు కొమ్మల వద్దే. అయితే వీటికి మూలమైన వేళ్ళు మాత్రం ఆకాశంలోనే ఉన్నాయి. అనంతాకాశం నుంచి వర్షించే కాంతి కిరణాలు, మబ్బులు, ఆ సూర్యశక్తి ద్వారా లభించే ప్రాణశక్తి... ఇవన్నీ పైన ఉన్న మూలాలు. ఇలా ఉన్న ఈ చిత్ర
జగద్వృక్షం ‘అశ్వత్థం'. ‘శ్వ' అంటే రేపు, 'రేపు ఉండనిది' - అశ్వత్థం. దీని
ప్రపంచం ఇవాళ ఉన్నట్లు రేపుండదు. నిత్య పరిణామశీలమైనది. వృక్షంలో చిగురింత,ఈ పుష్పీకరించడం, ఫలించడం, ఆకులు రాల్చడం.. మళ్ళీ చిగురించడం.. ఇలా నిత్య
పరిణామం కనిపిస్తుంది. చెట్టుకి పచ్చని పత్రాలు ఎలాంటివో, ప్రపంచానికి సనాతనధర్మం అట్లాంటిది. ధర్మమే ప్రపంచానికి రక్ష. అది లేనినాడు ఈ జగత్తు
ఆకులు లేని మోడులాంటిది.

రామాయణాన్ని. భారతాన్నీ, భాగవతాన్నీ కల్పవృక్షాలుగా వర్ణించారు. చెట్టులో జీవితాన్నీ, జగతినీ దర్శించగలిగి, ఈ రెండు పచ్చగా, సఫలంగా ఉండాలని
కాంక్షించారు వేదర్షులు. చెట్టుని నరకడం మహాపాతకమని హెచ్చరించారు. తప్పనిసరై
ఒక్క చెట్టును నరికితే, ఆ దోష నివారణార్థం ప్రాయశ్చిత్త కర్మ చేసుకొని, తగిన చోట
ప్రత్యామ్నాయంగా కొన్ని మొక్కలను నాటాలని పరిహారాన్ని నిర్దేశించారు. చెట్టునీ, కొమ్మలనీ హింసించకుండా పత్రాలను, ఫలాలను గ్రహించాలని చెప్పారు.

తులసి, మారేడు, కదంబం, ఉసిరిక, మేడి - వంటి దేవతావృక్షాలు తమ నుంచి దివ్యశక్తి తరంగాలను వాతావరణంలో నింపుతాయని ఇటీవల కొన్ని విజ్ఞాన పరిశీలనలు ఋజువు చేస్తున్నాయి. 'వనదేవతలు' అనే మాట మనకు ఎలాగూ ఉంది.

'వృక్షాణాం పతయే నమః' అని రుద్రనమకం కీర్తిస్తే 'న్యగ్రోధోదుంబరోశ్వతః' అని
విష్ణుసహస్రం వినుతించింది. ఋషులందించిన వృక్షారాధనలోని విశాల విజ్ఞానదేవతా భావనను గ్రహించగలిగిననాడు పర్యావరణాన్ని పచ్చదనంతో నింపగలగడం తేలికైన
పనే.

☘️🍁 ఆప్తవాక్యాలు 🍁☘️


132. సమానమస్తు వో మనః...

మీ మనస్సు ఏక(సమాన) మగుగాక

సృష్టిలో ఏ కార్యం సాధింపబడాలన్నా, సరియైన ప్రగతి సిద్ధించాలన్నా కావలసినది ‘సౌమనస్యం'. ఆ కార్యంలో ఉన్నవారందరి మనసులు ఏకం కావడమే - ఈ సద్భావనకు
అర్థం.

కానీ ఈ సామరస్యాన్ని సాధించడం అంత తేలిక కాదు. 'అందరం కలిసి సాగుదాం',‘ఐకమత్యమే మహాబలం' ఇలాంటి మాటలు వినడానికి బాగుంటాయి కానీ,ఆచరణకు వచ్చేటప్పటికి అసాధ్యాలౌతున్నాయి.

అయితే ప్రాచీన వైదిక నాగరికత 'సమభావన'తో ఉన్న సమాజాన్ని ఎంత చక్కగా ఆకాంక్షించిందో పై మంత్రం వల్ల తెలుస్తోంది.
ఋగ్వేదంలోని 'సౌమనస్య సూక్తం',
అథర్వవేదంలోని 'సంజ్ఞాన సూక్తం' అన్ని కాలాలకీ, అన్నీ దేశాలకీ పనికి వచ్చే అద్భుత భావాన్ని ఆవిష్కరించాయి.

'ధర్మనిరతులైన వారందరూ పరస్పర సహకారంతో, చక్కగా మాట్లాడుకొని, సమాన మనస్సుతో ముందుకు వెళ్ళాలి' అని వైదికమార్గం, వ్యక్తుల నడుమ మాట్లాడే అవకాశం
లేకపోవడం ఒక పెద్దలోపం. నేటి పరిభాషలో 'కమ్యూని కేషన్ గ్యాప్’.

☘️🍁 ఎవరు భగవంతుడు? 🍁☘️

కొంతమంది క్రిస్టియన్స్, ముస్లిమ్స్ ఇలా ప్రశ్నిస్తారు మీ దేవుడు ఎవరు ఎవరు బ్రహ్మ న, విష్ణువ, శివుడ,అమ్మవార లేదా విగ్నేశ్వరుడ ఇల.

ఎందుకంటే ఈ క్రిస్టియన్స్ ప్రకారం ఐతే వాళ్ళు ఎవరో ఒకరు మగ దేవుడు ఉన్నారు అని అలానే ఆయన కొడుకు యేసు అని ఆ యేసు ని నమ్మి బాప్తిస్మము తీసుకుంటే పరలోకం లేకుంటే నిత్య నరకంఅంటువుంటారు.

ఇంక ముస్లిమ్స్ దెగ్గరికొస్తే కొందరు చెప్పే దాని ప్రకారం అల్లాహ్ కి రూపం వుంది కాని మనం చూడలేము అంటారు, అలానే అల్లాహ్ కి ఆకారం వుంది అని చెప్పొచ్చు ఎలా అంటే

వాళ్ళని కాని మనం అల్లాహ్ సర్వంతరయామి లేదా సర్వ వ్యాపకుడ అంటే వాళ్ళు కాదు అని అంటారు.

ఇక్కడే చెప్పొచ్చు అల్లాహ్ కి ఆకారం వుంది అని. అసలు ఆకారం అంటేనే హద్దులు కల్గినది అని అర్థం. అంతట లేడు అంటేనే ఎదో ఒక ఆకారం ఉన్నట్లు.

వీళ్ళ ప్రకారం ఎదో ఒక రూపం లో దేవుడు ఉన్నారు అని, ఎదో ఒక పేరు వుంది అని నమ్మి అతను ఒక గ్రంధం ఇచ్చాడు అది నమ్మి దాన్ని అనుసరిస్తే పరలోకం లేకపోతే నిత్యనరకం ఇలా ఉంటుంది.

ఇక్కడ వాళ్ళవి చదివితే వచ్చే వచ్చే డౌట్ ఏమిటంటే ఒక్కొక్కరిని ఒక్కోలా సృష్టించి అంటే కుంటి, గుడ్డి, పేద, ధనిక, మంచి మనుషులు ఉన్న చోట, హత్యలు చేసే ఫ్యామిలీ లో, అలానే వేరు వేరు మతాలలో ఇలా పుట్టించి అందరు ఒకటే నమ్మాలి అంటే ఎలా ఇది అన్యాయం కధ? వీటిని రెండు పోస్ట్లు గ ఇంతకుముందు అడిగాను, తెలియని వాళ్ళు ఉంటే pinned messege లలో చూడండి.

అలానే ఒక రూపం తో ఒక చోట ఉంటే ఆ దేవుడు వున్న స్థలం ని ఎవరు సృష్టించారు? ఇప్పుడు మనం భూమి మీద వున్నాము, భూమిని మనం సృష్టించల. అల ఒక చోట ఉన్నారు అంటే ఆ దేవుడు వున్న చోటు ఎవరు సృష్టించారు?

రూపం తో ఒక ప్లేస్ లో నే ఉంటే పూర్తి సృష్టికర్త, సర్వ జ్ఞానీ కాలేరు.

ఇప్పుడు హిందువుల ప్రకారం దేవుడు అంటే ఎదో ఒక పేరు తో ఎదో ఒక స్థలం లో ఉంటాడు అని కాదు. సర్వంతర్యామి, సర్వ వ్యాపకుడు.

i) ముందు నిర్గుణ బ్రహ్మం వున్నది, అప్పుడు సృష్టి లేదు ఏమి లేదు, ఒక్క నిరాకార పరమాత్మ నే వున్నది. ఆ పరమాత్మ తో శక్తి ఏకం ఐయ్యి వున్నది ఇక్కడ.

ii) తర్వాత తన శక్తి ని బయట పెట్టి ఆ శక్తి ద్వారా సృష్టి కలిపిస్తాడు. ఇక్కడ ఆ నిరాకార బ్రహ్మం తనలో గుప్తం గ వున్న గుణాలని బయట పెట్టడం ద్వారా ఇక్కడ గుణాలలో కూడిన బ్రహ్మాన్ని సగుణ బ్రహ్మం గ పిలుస్తారు, ఈ సగుణ బ్రహ్మం నే ఈశ్వరుడు అంటారు, వాసు దేవుడు అంటారు ఒక్కొక్క పురాణం లో ఒక్కోలా . ఈ సగుణ బ్రహ్మం సర్వంతర్యామి, సర్వ వ్యాపకుడు.

ఈ సగుణ బ్రహ్మం నుంచి వచ్చిన రూపాలే ఏ భగవద్ రూపం ఐన.

బ్రహ్మ నా నుంచి సమస్తం వచ్చింది అన్న, కృష్ణుడు న నుంచే సమస్తం వచ్చింది అన్న, శివుడు నా నుంచే సమస్తం వచ్చింది అన్న, అమ్మవారు నా నుంచే సమస్తం వచ్చింది అన్న, వినాయకుడు నా నుంచే సమస్తం వచ్చింది అన్న

ఇక్కడ వారు నా అంటే ఆ కన్పించే రూపం గురించి మాట్లాడటం లేదు, ఇక్కడ నా అంటే ఆ సగుణం బ్రహ్మం గురించి మాట్లాడుతున్నారు, ఇక్కడ వారిని వారు సగుణ బ్రహ్మం గ చెబుతూ నా నుంచే సమస్తం వచ్చాయి అని చెబుతున్నారు.

కాబట్టి ఎవరు చెప్పిన అన్ని కరెక్ట్ ఏ, ఆ చెప్పిన భగవంతుడు సగుణ బ్రహ్మం స్థానం లో ఉండి చెబుతున్నారు.నా నుంచే సమస్తం వచ్చాయి అని పురాణాలలో ఏ భగవంతుడు చెప్పిన ఆ భగవంతుడు తనని సర్వంతర్యామి, సర్వ వ్యాపకుడిగ ఉన్న బ్రహ్మం ని దృష్టిలో పెట్టుకొని చెప్పారు కాని ఒక రూపం తో పరిమితం చేసుకొని చెప్పలేదు. ఎందుకంటే తనకి తెలుసు నేను అంతట ఉన్నాను అని, భక్తులను, ఉపాసకులని అనుగ్రహించడం కోసం రూపం తీసుకుంటాను, ఈ రూపం ఏ నేను కాదు అని తెలుసు ఆ భగవద్ రూపానికి.

ఈ పైన చెప్పిన విషయం కి ప్రమాణం ఏది అని అడిగితే ఆ ప్రమాణం మహాభారతం నుంచి చూపిస్తున్నాను కింద చూడండి.

వ్యాస మహాభారతం శాంతిపర్వం 339 వ అధ్యాయము

44-45) నిర్గుణో నిష్కలశ్చైన నిర్ద్వంద్వో నిష్పరిగ్రహః
ఏతత్త్యయా న విజ్ఞేయం రూపవానితి దృశ్యతే ॥ 44

ఇచ్ఛన్ముహూర్తాన్నశ్యేయమ్ ఈశోహం జగతో గురుః
మాయా హ్యేషా మయా సృష్టా యన్మాం పశ్యసి నారద ॥ 45

తాత్పర్యం :-

నేను నిర్గుణుడను, నిష్కలుడను, ద్వంద్వాతీతుడను,పరిగ్రహం లేనివాడను (దేనిని గ్రహింపనివాడను), రూపం ఉన్నది కాబట్టి కన్పిస్తున్నానని అనుకొనరాదు. తలుచుకొంటే ఒక్కక్షణంలో అదృశ్యం అవుతాను. నేనే పరమేశ్వరుడను. జగద్గురువును. నారదా ! నీవుచూసే ఈ రూపం నా మాయా సృష్టియే.

కాబట్టి శృతి, స్మృతి ప్రతిపదించిన ఏ రూపం ఐన ఆ సగుణ బ్రహ్మం యొక్క రూపమే.ఎవరికిష్టమైన రూపాలలో వారిని పూజించుకోవచ్చు. అంతేకాని ఒకరిని ఎక్కువ, తక్కువ గల చూడకండి, నువ్వు పూజించే దేవుడే ఆ రూపం లో కూడ ఉన్నారు అని అల చూసి పూజించండి.

యత్ర యోగేశ్వరః కృష్ణో
యత్ర పార్థో ధనుర్ధరః
తత్ర శ్రీః విజయో భూతిః
ధ్రువానీతిర్మతిర్మమ||

- ఎక్కడ యోగీశ్వరుడైన కృష్ణుడు, ధనుర్ధారి అయిన అర్జునుడు ఉంటారో అక్కడ సంపద, విజయం, ప్రకాశం, నీతి నిశ్చితంగా ఉంటాయి.

ప్రయత్నానికీ, ఫలానికీ అనుసంధానమే 'యోగం'. ఆ యోగాన్ని కలిగించే దైవమే
‘యోగీశ్వరుడైన కృష్ణుడు’, ఇక్కడ పార్థుడు ధనువును విడచినవాడు కాడు. ధనువును దాల్చినవాడు. అంటే - కర్తవ్యోన్ముఖుడు, ప్రయత్నశీలుడు.

దైవానుకూలం, పురుషప్రయత్నం - ఈ రెండూ సిద్ధించడమే ఈ శ్లోకంలో ప్రత్యక్ష దృశ్యం.

మన సంస్కృతి కేవలం దైవకృపకే కాదు - పురుషప్రయత్నానికీ ప్రాధాన్యమిచ్చింది.

☘️🍁 ఆప్తవాక్యాలు 🍁☘️


131. ధర్మాదర్దశ్చ కామశ్చ

ధర్మము ద్వారానే అర్థకామములు (మహాభారతం)

అర్థ, కామాలే మనిషి సాధించవలసినవి... అనేది భూమిపై ప్రతి మానవునికీ పరమ ప్రయోజనమనిపించే సిద్ధాంతం. దీనిని ఏ ఒక్కరూ కాదనలేరు. కానీ జీవిత
పరమార్థం ఈ రెండే కాదు. అర్థ, కామాలు ముఖ్యమనుకుంటే వాటిని సాధించడానికి ఏ అక్రమమార్గాన్నైనా తొక్కవచ్చు. సమాజంలోని చట్టాలు, న్యాయాలు నిరోధిస్తే వాటిని కూడా అక్రమంగా తొక్కిపెట్టి మరీ అర్థకామాలను సమకూర్చుకోవచ్చు.

అర్థకామాల విషయంలో సరియైన నియంత్రణ లేకపొతే వ్యక్తి క్షేమానికీ, సమాజ భద్రతకీ కూడా ప్రమాదమే. ఈ ప్రమాదాన్ని అరికట్టడంలో న్యాయవ్యవస్థ, రక్షణ వ్యవస్థ కూడా విఫలమయ్యే అవకాశముంది.

వ్యక్తిలో సహజంగా ఒక నియంత్రణని నిబద్ధం చేసే శక్తి ధర్మానికి ఉంది. ఆ
విధమైన ధర్మాన్ని బాల్యం నుండి వ్యక్తిలో నింపినట్లయితే, అదే వారి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతుంది. చట్టానికి దొరికినా, దొరకకున్నా ధర్మం, దైవం పరికిస్తున్నాయనే స్పృహ ఉన్నప్పుడు హద్దులను అతిక్రమించరు.

ఆ విధమైన వ్యక్తిత్వ వికాసాన్ని కలిగించడానికై మన ధర్మశాస్త్రాలు, పురాణేతిహాసాలు కృషి చేశాయి. ధర్మవిరుద్ధంగా 'అర్థ' సంపాదనకై అలమటించిన దుర్యోధనాదులు,
కామసంపాదనకై ధర్మాతిక్రమణ చేసిన రావణాదులు - ఏ విధంగా దెబ్బతిన్నారో భారత,రామాయణాలు బోధిస్తున్నాయి. ధర్మంతో సంపాదించిన అర్థకామాలతో
తృప్తి చెందేవాడు ఉత్తమ వ్యక్తి. వాటి సంపాదనకు ధర్మమార్గాన్ని అవలంబించడమేకాక,
ధర్మపు హద్దులో వాటిని అనుభవించడం కూడా గొప్ప జీవితం.

మన ప్రాచీన సంస్కృతిలో ఈ మూడు పురుషార్థాలనే ప్రధానంగా చెప్పారు.
తరువాత 'మోక్షం' చేర్చబడింది. కానీ నిజానికి మోక్షం సాధించే వస్తువు కాదు.అర్థకామాల వలె మనకి దూరమైనది కాదు. అది సిద్ధమైన వస్తువు. దానిని గుర్తించడమే
మనం చేయవలసినది. అయితే మోక్షాన్ని పురుషార్థంగా చెప్పినంత మాత్రాన దోషము లేదు. “అది పురుషార్థం కాదు. పరమార్థం" అనే వివేకం ఉంటే చాలు. నిజానికి
దుఃఖనాశనమే మోక్షం.

అర్థకామాలకు ముందు ధర్మాన్ని మనం సాధించవలసిన ప్రయోజనంగా చెప్పారు మహర్షులు. శాస్త్ర సహాయంతో సత్పురుషుల సందేశాలతో ముందుగా ధర్మవిషయమైఅవగాహననీ, ఆచరణనీ సాధించాలి. ధర్మాన్ని సంపాదించుకోవాలి. అటు తరువాతే
అర్థకామాలు.

అయితే ధర్మాన్ని ఆర్జించినవానికి సులభంగా అర్థకామాలు లభిస్తాయని కూడా మహాత్ముల అభిప్రాయం.

ధర్మబద్ధంగా అర్థాన్ని ఎలా సంపాదించాలి, ఎలా వినియోగించాలి అని చెప్పేది అర్థశాస్త్రం. ‘ధర్మార్థ కామేభ్యో నమః - అని వాత్స్యాయనుడు కూడా ధర్మసమ్మతమైన కామ పురుషార్థ విషయమై కామశాస్త్రాన్ని రచించాడు.
అభ్యుదయాన్ని (ఇహలోకం
సుఖాన్ని), నిశ్రేయసాన్నీ (మోక్షాన్ని) ప్రసాదించే శక్తి ధర్మానికి ఉందని కణాదమహర్షి
"యతో...భ్యుదయ నిశ్రేయస సిద్ధిః స ధర్మః" దేని వలన అభ్యుదయ నిశ్రేయసాలు సిద్ధిస్తాయో అదే ధర్మం) అని నిర్వచించాడు.


సర్వశాస్త్ర స్వరూపమైన మహాభారతంలో వ్యాసదేవుడు అంటున్నాడు.“ఊర్థ్వబాహుర్విరోమ్యేష నకశ్చిత్ అపి శ్రుణోతి మాం। ధర్మాదర్థశ్చ కామశ్చ సమ
కిమర్థం న సేవ్యతే” - రెండు చేతులు పైకెత్తి ఘోషిస్తున్నాను. ధర్మం వలననే
అర్థకామాలు సిద్ధిస్తాయి. అటువంటి ధర్మాన్ని ఎందుకు ఆచరించరు?... అని ఆర్తితో ఎలుగెత్తుతాడు. ధర్మం అనే బీజం నుండి వచ్చిన అర్థకామాలే జీవితానికి సార్థకతనీ,మోక్షఫలాన్నీ అందిస్తాయి... అనేది తాత్పర్యం.

'సృష్టిలో అన్నీ తమంత తాముగా జరుగుతున్నా మనిషి తన ప్రయత్నం తాను మానడు. అది మానవుని సహజ లక్షణం' అనే భావనతో ఈ వాక్యాన్ని పలికారు మహర్షులు.

ఈ ప్రపంచంలో ఏ పని సఫలం కావాలన్నా పురుష ప్రయత్నం (మానవుని సాధన), దైవానుకూలత - రెండూ కలిస్తేనే సాధ్యం.

నాగలితో దున్ని, విత్తనాలు వేసి కాపు కాయడం పురుషప్రయత్నమైతే - వేసిన విత్తనం సరిగ్గా మొలకెత్తి, ఏ తెగులుకీ, పురుగుకీ గురికాకుండా చేతికందడం దైవానుకూలం. పురుషప్రయత్నాన్ని కర్మశీలతతో, ధర్మనిష్ఠతో, భగవద్భక్తితో పటిష్ఠం
చేసుకుంటే దైవ సహాయం ప్రస్ఫుటంగా అందుతుంది.

ఈ రెండిటిలో ఏ ఒక్కటి లోపించినా సాఫల్యం ఉండదు.

శ్రీరామకృష్ణపరమహంస ఈ విషయంలో చక్కని వివరణను అందించారు. “కత్తెర ఒక వస్త్రాన్ని కత్తిరిస్తే అందులోని రెండు పదును కత్తులలో ఏది కత్తిరించిందో
చెప్పగలమా! రెండిటిలో ఏ ఒక్కటి పనిచేయకపోయినా కత్తిరింపు దుస్సాధ్యం.అలాగే పురుష ప్రయత్నమూ, ఈశ్వరానుగ్రహమూ రెండూ కలిస్తేనే సిద్ధి”.

'భగవద్గీత' పూర్తయ్యాక ఆ మొత్తాన్నీ దర్శించి శ్రవణం చేసి, ధృతరాష్ట్రునకు
వినిపించిన సంజయుడు చెప్పిన చరమవాక్యం ఒక అద్భుత సత్యావిష్కారం.

☘️🍁 ఆప్తవాక్యాలు 🍁☘️

130. కశ్చిద్ధీరః ప్రత్యగాత్మానమైక్షత్
ఏ ఒక్కడో ధీరుడు మాత్రమే

(అంతర్ముఖుడై) తనలోని పరమాత్మను దర్శించగలడు
(కఠోపనిషత్)

సర్వవ్యాపకమైన పరమాత్మను ధీరుడు మాత్రమే తెలుసుకోగలడు అని శాస్త్రాలు తీర్మానించాయి.

దుఃఖాన్ని అధిగమించడానికైనా, శాశ్వతానందాన్ని సాధించడానికైనా, ఏ రంగంలో ప్రగతిని పొందడానికైనా 'ధీరత్వం' ప్రధాన గుణం. ఆధ్యాత్మిక శాస్త్రంలో దీనికి విశిష్ట విస్తృతార్థం ఉన్నప్పటికీ, ప్రారంభదశలో దీనిని భౌతికార్థంగా స్వీకరించవచ్చు.
వ్యక్తిత్వ నిర్మాణంలో 'ధీర'గుణం అత్యంత ప్రధానం. ఇది విజయసూత్రం కూడా.

వికారం కలిగించే సందర్భాల్లో కూడా, వాటికి లోనుకాకుండా, చెక్కుచెదరకుండా ఉండగలిగే స్థిరబుద్ధియే 'ధీరత్వం'. 1. శోకం కలిగించే సన్నివేశాలలో, 2. కోపాన్ని
రగిల్చే సంఘటనలలో 3. కామాన్ని రేపే సందర్భాలలో మనసు సంయమనం కోల్పోవడం సహజం. కానీ అటువంటి వేళల్లో కూడా నిలదొక్కుకోవడమే ధీరగుణం.
ఒక వేళ చెదిరినా, తిరిగి వెంటనే నిబ్బరాన్ని అలవరచుకోవడం కూడా ఈ గుణంగా భావించవచ్చు.

తపోనిష్ఠుడైన సదాశివుని ధీరగంభీరమూర్తిగా వర్ణించాడు కాళిదాసు. శ్రీరాముని,శ్రీకృష్ణుని ధీరతాగుణం రామాయణ, భారత, భాగవతాల్లో వర్ణితం. అసలు ఉత్తమ
చరిత్రకి, కాలానికి ధీరత్వమే హేతువు. 'ఆ పరిస్థితుల్లో అదుపు తప్ప వలసి వచ్చింది'అని చెప్పేవాడు బలహీనుడు. ఏ స్థితిలోనూ ధర్మాన్ని తప్పని శ్రీరామభద్రుడు,
ధర్మరాజు వంటివారు - ఎంత సమర్థులైనా నిగ్రహాన్ని కోల్పోక నిలబడగలిగారు.యోగారూఢ స్థితిలోనున్న కృష్ణపరమాత్మ కూడా ఈ దివ్యగుణానికి సాకారం. అందుకే
వారిని 'ధీరోదాత్త చరిత్రులు' అన్నారు.

సంకల్పించుకున్న దానిని సాధించే వరకు నిలబడగలిగి, ఎన్ని అవరోధాలనైనా ఎదుర్కొంటూ నిలువరించుకుని సిద్ధింప చేసుకొనేవానిని 'ధీరుడు' అంటారు. ఈ దేవతాగుణంలో హనుమ కూడా పరమాదర్శమే. ఇది యోగానికి కూడా ప్రధానం.

ధీరత్వం ఇంద్రియ మనోనిగ్రహం వలననే సాధ్యమవుతుంది. మనసు చలించినా, మనిషి చలించిపోకుండా ఉండాలి. క్రమంగా మనశ్చాపల్యాన్ని నియంత్రించాలి.ఇహ జీవితంలో ఏ చిన్న పనిని సాధించాలన్నా ఈ లక్షణం ఉండవలసిందే. విద్యలో,
వ్యాపారంలో, వృత్తిలో అన్నిటా రాణించగలిగే శక్తి ఈ గుణానికి ఉంది.

ధీరత్వాన్ని బోధించే విద్యావిధానమే ఉత్తమ మానవుల్ని ఏర్పరచగలదు. మనస్సును నియంత్రించి, ఇంద్రియాలను నిగ్రహించి, బుద్ధిని అంతర్ముఖం చేయడమే ధీరత్వం.
దీని సాయంతో అరిషడ్వార్గాలను జయించడమే వీరత్వం.

ఎన్ని లోకాలను జయించినా, పదవుల పందాలలో గెలిచినా మనలోనున్న
కామక్రోధాదులను జయించగలగడమే ధీరవీరగుణం.

ఇలాంటివారే దృఢచిత్తంతో యోగ సాధనాపథంలో, అంతర్ముఖులై, అధ్యాత్మదృష్టితో తమ హృదయగుహలోని పరంజ్యోతిని దర్శించగలరు. ఇది అందరూ సాధించలేరు.

"వేలకొలదిలో ఒకడు ప్రయత్నిస్తే, అలా యత్నించిన వేలకొలదిలో ఒకడు మాత్రమే నన్ను (పరతత్త్వాన్ని) తెలుసుకోగలడు" అని గీతాచార్యుని మాట. ఈ పరతత్త్వాన్నే
భక్తులు 'భగవంతుడు' అంటారు. వేదాంతులు 'పరబ్రహ్మ' అంటారు.

"ధీరులచే పూజించబడేది (ధీరసమర్చితా”, “వీరులు ఆరాధించేది (వీరారాధ్యా)”
అనే నామాలు లలితా సహస్రనామాల్లో పేర్కొన్నారు. ఈ నామాలు కూడా ధీరగుణాన్ని
అలవరచుకోవడమే ఆవశ్యకమని చెబుతున్నాయి.

ఈ దైవీగుణం పెంపొందించుకుంటే ఆధ్యాత్మిక ప్రగతి సుసాధ్యమే.

☘️🍁 ఆప్తవాక్యాలు 🍁☘️


129. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే

ధర్మమును స్థాపించుటకై యుగయుగాలలోనూ అవతరిస్తాను(భగవద్గీత)

'అవతారం' అనే మాట చాలా లోతైనది.

భగవంతుని అవతారాలు అనంతాలు.

"నింగిలోని చుక్కల్నీ, నీటిలోని బిందువుల్నీ, నేలపై ధూళికణాలనీ లెక్కించవచ్చేమో గానీ భగవంతుని అవతారాలను, మహిమలను, గుణగణాలను తేల్చి చెప్పలేము”
అని వేదం, భాగవతం పేర్కొన్నాయి.

‘అవతారం' అనే మాటకు ‘దిగి రావడం' అని సామాన్యార్థం. ఒక ఉన్నత స్థానంలో ఉన్నవారు మన కోసం దిగివచ్చి నడిపించి మనల్ని ఉన్నతికి చేర్చడమే అవతారం.
పరమేశ్వరుడు నామరూపాల్లోకి ఒదిగి రావడమే అవతార తత్త్వం.

ఒక నది నుండి బయలుదేరిన కాల్వలు పంటలు పండించి, దాహార్తి తీర్చి ఆదుకున్నట్లు భగవంతుడు అవతారాలనే కాల్వల ద్వారా దివ్యత్వాన్ని మనకు అందిస్తాడు.

భగవద్రక్షణ ఆ అవతార కాలానికి మాత్రమే పరిమితం కాదు. ఆ అవతార గాథల్ని అధ్యయనం చేసి వ్యక్తిగతంగా తమలోని అధర్మ ప్రవృత్తుల్ని నశింపజేసుకొని,
ధర్మ ప్రవృత్తుల్ని వృద్ధిపరచుకొనేలా మానవ జీవితాలను మలచడమే అవతార ప్రయోజనం.

పరిత్రాణాయ సాధూనాం
వినాశాయ చ దుష్కృతాం।
ధర్మ సంస్థాపనార్థాయ
సంభవామి యుగే యుగేI...

అని గీతలో శ్రీకృష్ణుడు సెలవిచ్చిన అవతార మర్మం. ఇక్కడ 'యుగే యుగే' అన్న మాటకు ‘ఒకొక్క యుగంలో' అనే అర్థాన్నే కాక, 'మాటి మాటికి' అనే భావాన్ని కూడా గ్రహించవచ్చు. మనం హృదయంలో స్వామిని తలచుకుంటే చాలు, ఆయన మనలో అవతరించినట్లే. అది మాటి మాటికీ జరగాలి.

'రామకృష్ణాది అవతారాలు మనలాగే భూమిమీద చరించినవి కదా!' అని
కొందరంటుంటారు. అది సరికాదు. కొట్టుకుపోయేవారిని, మునిగిపోయేవారిని
కాపాడటానికి ఒడ్డున ఉన్న గజ ఈతగాడు నదిలోకి దిగుతాడు. అది చూసి కొట్టుకుపోయే వారంతా 'ఈయన కూడా మనలాగే నదిలో దిగాడు' అనుకోవడం ఎంత అవివేకమో, రామకృష్ణాదులను మనతో పోల్చడమూ అంతే. ఈతగాడు మునగడు. మనల్నీ మునగనివ్వడు. అతనికి నీటిలో దిగవలసిన అవసరం లేదు.
దిగినా నీటిని లొంగదీసుకొని మనల్ని ఉద్ధరిస్తాడు.

మనల్ని బాధించే నీరు అతనిని బాధించదు. ప్రపంచంలోని మాయ పరమాత్మను అంటదు. మాయ చేతిలో మనమున్నాం. ఆయన చేతిలో మాయ ఉంది.

'సంభవామ్యాత్మ మాయయా'అనడంలో ఆంతర్యమిది. తండ్రి పిల్లవానికి నడకలతో
మొదలుపెట్టి, నడతల వరకు బోధించినట్లే - జగతిలో కైవల్యాన్ని పొందే జ్ఞాన ధర్మాది మార్గాలను తానే ఆచరించి బోధించడం అవతారాల్లో కనిపిస్తుంది.

తపోమార్గాన్ని బోధించిన నరనారాయణావతారం, తత్త్వజ్ఞానాన్ని అందించిన
కపిలావతారం, అవధూత స్థితిని తెలియబరచిన దత్తాత్రేయావతారం, ఉత్తమ మానవ ధర్మాలను ఎరుకపరచిన శ్రీరామావతారం, సర్వాంతర్యామిత్వాన్ని ప్రకటించిన
నృసింహావతారం, పరిపూర్ణ భగవద్భావాన్ని వ్యక్తీకరించిన శ్రీకృష్ణావతారం... అన్నీ వేటికవి ప్రత్యేకం. అన్నీ మనకు ఉపాస్యాలే. అందనివాడు అందుబాటులోకి రావడమే అవతారం.

Live stream started

☘️🍁 ఆప్తవాక్యాలు 🍁☘️


128. యథా చ నః శర్మ యచ్చద్విబర్హాః

ఐహికాముష్మిక సుఖములు లభించే విధంగా అనుగ్రహించు(యజుర్వేదం)

మన సంస్కృతి కేవలం పరలోక సుఖాలకోసం ప్రాధాన్యమిచ్చిందనీ, ఇహ జీవితంలోని ప్రగతిని వెనకబరచిందనీ ఒక విమర్శ ఉంది. వారికి పై శ్రుతివాక్యమే
బుద్ధి చెబుతుంది.

ఇహంలో సుఖము, అభ్యుదయం ఉండాలి. అదే సమయంలో ఐహిక జీవితానికి ఒక లక్ష్యం ఉండాలి.

అది - పారమార్థికం.

( తత్కాల సౌఖ్యమే ఇక్కడ - అనే స్పృహ ఉన్నవాడు దీని కోసం విలువైన వ్యక్తిత్వాన్ని నశింపజేసుకోడు. త్యాగంలో ఉన్న మాధుర్యాన్ని, ధర్మంలో ఉన్న తృప్తినీ అనుభవిస్తాడు. ధర్మపు హద్దుల్లో సుఖమయ జీవితాన్ని గడుపుతాడు. తన అవసరానికి మించి లభించిన సొమ్మును భగవదర్పణ బుద్ధితో త్యాగం చేసి సేవకీ, ధర్మానికీ వినియోగిస్తాడు. పరమార్థం కోసం
ఐహికాన్ని పవిత్రంగా మలచుకుంటాడు.)

పరమార్థం దిశగా ఇహజీవితం సాగినప్పుడు వ్యక్తికీ, సమాజానికీ క్షేమం కలుగుతుంది. కేవలం భౌతికజీవితమే పరమావధి అనుకున్నవాడు ఇక్కడ సుఖపడడం
కోసం అసత్యాన్నీ, పాపాన్నీ అనుసరించడానికి వెనుకాడడు. కపటం, అవినీతి మొదలైన
దారుల్ని తొక్కుతాడు. బాధాకరమైన అంశమేమంటే - ఆధ్యాత్మిక మార్గంలో జీవించే వాళ్ళు కూడా ఈ పాపాల్ని ఆచరిస్తున్నారు. అంటే వారు జీవికకి ఆ మార్గాన్ని ఎంచుకున్నారే కానీ, నిజమైన ఆధ్యాత్మిక జీవనులు కారని అర్థం.

ఎంతకాదన్నా ఐహిక జీవితం అల్పమైనది. అనేక పరిమితులు, మితి ఉన్నదీ బ్రతుకు. ఎడతెగని ఆశతో ఇక్కడ సుఖపడాలనుకున్నా, సుఖానికీ స్థిరత్వం లేదు -అనుకున్నవాడి అస్తిత్వము సుస్థిరం కాదు.

'కారే రాజులు రాజ్యముల్ కలగవే... పద్యంలో పోతనగారు చెప్పినట్లు, ఎందరినో వంచించి, హింసించి రాజ్యాల్నీ పదవీ కాలాలనీ విస్తరింపజేసుకున్న వారి జీవితానికే
విస్తృతి లేదు. అక్రమంగా గడించిన ఆస్తుల్నీ, 'కబ్జా' చేసిన భూముల్ని ఇక్కడే వదలి దిక్కులేని విధంగా గాలిలో కలిసిపోయిన అధినేతల జీవితాలే మనకు పాఠాలు
చెబుతున్నాయి. అయినా అవధి లేని ఆశ ఇంకా మానవులకి గుణపాఠాల్ని
నేర్చుకోనివ్వడం లేదు.

పరమార్థాన్ని దృష్టిలో పెట్టుకున్న మానవుడు ఇహంలో పాపానికి వెనుకంజ వేస్తాడు.

తత్కాల సౌఖ్యమే ఇక్కడ - అనే స్పృహ ఉన్నవాడు దీని కోసం విలువైన వ్యక్తిత్వాన్ని నశింపజేసుకోడు. త్యాగంలో ఉన్న మాధుర్యాన్ని, ధర్మంలో ఉన్న తృప్తినీ అనుభవిస్తాడు.అలాగని భౌతికతని తృణీకరిస్తాడని కాదు. భౌతిక సుఖాల కోసం ఇక్కడ ధన, కీర్తుల కోసం ధార్మికవిలువల్నీ, ఆధ్యాత్మిక సాధననీ త్యజించడు. ధర్మపు హద్దుల్లో
సుఖమయ జీవితాన్ని గడుపుతాడు. తన అవసరానికి మించి లభించిన సొమ్మును భగవదర్పణ బుద్ధితో త్యాగం చేసి సేవకీ, ధర్మానికీ వినియోగిస్తాడు. పరమార్థం
కోసం ఐహికాన్ని పవిత్రంగా మలచుకుంటాడు.

ఇటువంటి దృక్పథం ఉన్నవాని వలన ఇతరులకి కీడు జరగదు. పరస్పర సహకార, సౌమనస్యాలు విలసిల్లుతాయి. బాల్యం నుండి 'పరమార్థ జీవనానికి భంగం కలగని
పవిత్ర భౌతిక జీవనం' - అనే సూత్రాన్ని బోధించాలి.

ఇది ఒంటబట్టిన మానవుడే ఉత్తమ వ్యక్తిత్వం కలవాడవుతాడు. వ్యసనాలనీ, బలహీనతల్నీ జయించాలంటే ఈ సూత్రమే పునాది. వ్యక్తి, దేశం అన్ని వనరులతో
సంపన్నంగా, బలంగా ఉండాలంటే ఈ సమతౌల్య జీవనం అవసరం. ఇహ, పర సుఖాలనే రెండు రెక్కలతో మానవ జీవితం ఆనందంగా పయనించగలదు.

అసలైన గమ్యాన్ని హాయిగా చేరగలదు.

Live stream finished (1 day)