Últimas publicaciones de తెలుగు ఆధ్యాత్మిక పుస్తకాలు (@pusthakam123) en Telegram

Publicaciones de Telegram de తెలుగు ఆధ్యాత్మిక పుస్తకాలు

తెలుగు ఆధ్యాత్మిక పుస్తకాలు
7,520 Suscriptores
1,375 Fotos
24 Videos
Última Actualización 01.03.2025 08:17

El contenido más reciente compartido por తెలుగు ఆధ్యాత్మిక పుస్తకాలు en Telegram


☘️🍁 ఆప్తవాక్యాలు 🍁☘️


147. మా కస్య అద్భుత క్రతూ! యక్షం భుజేమ తనూభిః
మా శేషసా మా తనసా

ఓ అద్భుతకర్మపరులారా! మేము మా తనువులతో యక్షమును
అనుభవించకుందుము గాక, వారసత్వముగా లభించిన ధనమునూ, సంతానము
ఆర్జించిన సొమ్మును భోగించకుందుము గాక (ఋగ్వేదం)

స్వశక్తితో సంపాదించినదే అనుభవానికి యోగ్యం అని పై వేదవాక్య హృదయం.

పిత్రార్జితం మధ్యమమే. అలా వచ్చిన వాటిని సత్కార్యాలకు వినియోగించవచ్చు.

తల్లిదండ్రుల బాగోగులు చూడడం పుత్రులకు స్వధర్మం. దానిని వారు మీరరాదు.కానీ సంతానపు సొమ్ముపై మాత్రమే ఆధారపడడమూ ఆదర్శం కాదు. తమ స్వార్జితాన్నే సరియైన విధంగా ప్రణాళికాబద్ధంగా వినియోగించుకుంటూ దానితో జీవించడమే సమంజసం.

అయితే పైతరాల నుండి, తరువాత వారి నుండి తమంత తాముగా వచ్చిన ఆదాయాన్ని ధార్మిక సత్కర్మలకు వెచ్చించడం శ్రేష్ఠం.

అదే విధంగా 'యక్ష'మును అనుభవించరాదు. అని శాస్త్రం. 'యక్ష' శబ్దానికి 'పూజార్హమైన ద్రవ్యం' అని అర్థం. దానికి చాలా అన్వయించవచ్చు.

దైవ ద్రవ్యాలు, లేదా - పూజ్యుల (మహాత్ముల, గురువుల) ద్రవ్యములు లేదా -గౌరవనీయంగా లభించిన కానుకలు, దానాలు... ఇన్ని అర్థాలు 'యక్షము' అనే పదానికి ఉన్నాయి. వీటితో జీవించడం,అనుభవించడము తగదని భావం.

మొత్తంగా శ్రమతో సాధించిన స్వార్జిత విత్తం అనుభవించడమే శ్రేష్ఠం - అని
తాత్పర్యం.

స్వశక్తినీ, శ్రమనీ - దాని వలన లభించిన సక్రమార్జనని మాత్రమే అనుభవించాలి-అని శాసించిన వేదమాత ఎంత అద్భుత జీవనశైలిని ఆదర్శంగా బోధించిందో
అవగతం చేసుకోవాలి.

'ఉత్తమం స్వార్జితం విత్తం' - అని సుభాషితకారుడూ ఈ నీతినే బోధించాడు.

పిత్రార్జితాన్ని 'మధ్యమం' అన్నారు.

స్త్రీ శ్రమించి సంపాదించిన దానిని అనుభవించడం 'అధమం'గా పేర్కొన్నారు.అంటే స్త్రీ శ్రమని దోచుకోరాదు అనే భావన కూడా ఇందులో ఉంది. స్త్రీమూర్తికి
మన సమాజమిచ్చిన గౌరవమది.

శుద్ధమైన స్వార్జితం వల్ల ఆరోగ్యం, చిత్తం కూడా బలంగా, శుద్ధంగా సత్కర్మలకు యోగ్యంగా ఉంటాయి.

కేవలం లోకకల్యాణానికై తమ ప్రకాశాన్ని వినియోగిస్తున్న సూర్య చంద్రాదులను ఇందులో సంబోధించారు.

'అద్భుతక్రతూ' - 'ఆశ్చర్యకరమైన గొప్పపనులు చేసేవారు' - వేద ప్రకారంగా దేవతలు, ప్రత్యక్ష రూపులైన సూర్యచంద్రులు. వారు తమదైన శక్తితో, విశ్వహితానికై
ప్రవర్తిస్తున్నట్లుగా, స్వశక్తితో సమాజహితానికి పాటు పడేలా అనుగ్రహించమని వారి రూపంగా ఉన్న పరమేశ్వరుని ప్రార్థిస్తున్న మంత్రమిది.

☘️🍁 ఆప్తవాక్యాలు 🍁☘️

146. ఇదం విష్ణుర్విచక్రమే త్రేధా నిదధే పదమ్

విష్ణువు ఈ విశ్వమంతటినీ మూడు అడుగులతో ఆక్రమించాడు (ఋగ్వేదం)

మూడు స్థానాలలో విష్ణువు తన పదాన్ని ఉంచాడనే ఈ మంత్రార్థంలో ఎన్నో భావాలు ద్యోతకమౌతున్నాయి.

వేదవేదాంతాది శాస్త్రాలతోనే ఆ భావాలని సమన్వయించి తెలుసుకోవాలి.

మూడు లోకాలలో, మూడు కాలాల్లో వ్యాపించినది ఈశ్వరచైతన్యమే - అనే
గ్రహింపు ఈ మంత్రం అందిస్తున్నది. 'త్రీణి పదా విచక్రమే' అని ఋగ్వేదంలో మహామంత్రం చెబుతున్నది. 'త్రిపాదూర్ధ్వముదైత్పురుషః' అని కూడా పురుషసూక్త
వచనం.

ఈ విశ్వంలో - పిండాండ, బ్రహ్మాండాలలో మూడు తత్త్వాలే ఉన్నాయి.సత్త్వరజస్తమోగుణాలనే మూడుగుణాలు, సృష్టిస్థితిలయలనే మూడు కృత్యాలు, ఊర్థ్వ
మధ్య అధోలోకాలనే మూడులోకాలు (లేదా స్వర్గ మర్త్య పాతాళాలు) ఇది
బహిర్జగద్విషయం.

ఇడ, పింగళ, సుషుమ్న - అనే నాడులు, బ్రహ్మ విష్ణు రుద్ర గ్రంథులు, జాగ్రత్ స్వప్న సుషుప్త్యవస్థలు, స్థూల సూక్ష్మ కారణ శరీరాలు, ప్రారబ్ధ సంచిత ఆగామి కర్మలు...ఇవి ప్రధానంగా పిండాండ (మనలోని విషయం.

ఈ మూడింటా వీటి చలనాలకి హేతువులై, వీటి ద్వారా ప్రపంచాన్ని నిర్వహించేవాడు ఈశ్వరుడు. మూడింటా ఉన్నది ఈతడే అని గ్రహించడమే 'తెలివి'. ఆ తెలివితో
ఆయన యందు మాత్రమే దృష్టిని ఉంచడమే 'ధ్యానం'.

మూడింటితో ఉన్న విశ్వమందు ఆక్రమించిన 'వ్యాపకత్వ లక్షణమే 'త్రివిక్రమత్వం'.ఈ వ్యాపకమే జగతికి చైతన్యం. అదే సౌందర్యం.

ఈ తత్త్వాన్నే 'త్రిపురసుందరి' అన్నారు.

అయితే విడివిడిగా కనబడుతున్న ఈ మూడింటిలో వీటితో కూడిన జగతిలో
వ్యాపించిన పరబ్రహ్మ స్వరూపం ఏకం. ఆ పరతత్త్వం శుద్ధంగా ఈ మూడింటికీ అతీతంగా ఉన్నది. ఏ పరిణామమూ లేని పరిపూర్ణస్థితి ఈ త్రిగుణాతీత తత్త్వంలో
ఉంది. దీనిని సాధించడమే కైవల్యం.

మూడింటినీ అధిగమించిన తత్త్వాన్నే 'త్రిపురాసురసంహారమూర్తి'గా సంభావించాలి.
-
ఇలా · త్రివిక్రమ, త్రిపురసుందరి, త్రిపురాసుర సంహారం... అనే భావాల
నడుమ ఒక సమన్వయం ఉందని స్పష్టమౌతుంది.

మూడు అవస్థలలో సాక్షిగా ఉన్న తత్త్వం తురీయావస్థ (సమాధి)లోనే
తెలియబడుతోంది.

జ్ఞాత (తెలుసుకొనేవాడు), జ్ఞానం (తెలివి), జ్ఞేయము (తెలియబడే వస్తువు) -మూడు (త్రిపుటి) ఏకమయ్యే స్థితి త్రిపురాసుర సంహారం. ఆ కైవల్యస్థితిలో ఉన్న
అఖండ జ్ఞానానంద రూపమే త్రిపురసుందరి.

ఆ పరచైతన్యమే మూడింటియందు అంతర్లీనమైన త్రివిక్రముడు. ఇది అత్యంత సూక్ష్మం కనుక 'వామనరూపం'.

యోగపరంగా చూస్తే సాధకునకు మూడు చక్రాల స్థానాలు ప్రధానం. వీటిని సాధించడమే 'త్రేధా నిదధే పదమ్' అనే భావంగా అన్వయించవచ్చు.

యోగసాధకుడు హృదయం వద్దనున్న అనాహతం నుండి ప్రాణాయామా దులను;ఆజ్ఞాచక్రం నుండి ధ్యానాదులను; సమాధిని సహస్రారాన సాగించడమే (జీవుని)
తన ఉన్నత భూమికారోహణ ప్రక్రియలు. ఈ సంకేతాన్నే త్రివిక్రమ కథ ద్వారా భాగవతం బోధించింది.

☘️🍁 వేదాలు 🍁☘️

నాలుగు వేదాలకి ఆర్య సమాజ్ వారి వేద భాష్యం మొత్తం 42 పుస్తకాలు ఉంటాయి.

అలానే దాశరధి రంగాచార్య భాష్యం.

☘️🍁 ఉపనిషద్స్ 🍁☘️

రామకృష్ణ మఠం వారి ఉపనిషద్స్ , ఉపనిషదర్శనం లో 4 బుక్స్ ఇందులో 12 ఉపనిషడ్స్ ఉంటాయి, ఉపనిషద్ ఉద్యానవనం ఇందులో 108 ఉపనిషడ్స్ ఉంటాయి.

☘️🍁 పురాణాలు 🍁☘️

అగ్ని పురాణం, నారద పురాణం, బ్రహ్మ పురాణం, పద్మ పురాణం లో మొదటి రెండు ఖండం లు, శివ పురాణం, దేవి భాగవతం, గరుడ పురాణం, వాయు పురాణం పూర్తి వచనం తో వున్నాయి.

శ్లోకాలతో సహా ఐతే వ్యాస భాగవతం, కూర్మ మహా పురాణం, శ్రీ శివ మహా పురాణం, దేవి భాగవతం, శ్రీ బ్రహ్మాండ పురాణం, శ్రీ మత్స్య, శ్రీ బ్రహ్మ వైవర్త పురాణం, శ్రీ విష్ణు మహా పురాణం, వాయు పురాణం లో మొదటి భాగం ఇవి అప్లోడ్ చేయబడ్డాయి.

అలానే గంగాధర్ గారి భగవద్గీత ఆడియో కూడ వుంది ఇది మ్యూజిక్ లో ఉంటుంది.

☘️స్తోత్రాలు, మంత్రాలు, ఉపాసన ☘️

దేవి, దేవతల ఉపాసన బుక్స్ వున్నాయి, స్తోత్రాలు వున్నాయి.

☘️ ఆరోగ్యం, కథలు ☘️

ఆరోగ్యం కి సంభందించిన బుక్స్,చందమామ కథలు పంచతంత్ర కథలు, పేదరాసి పెద్దమ్మ కథలు, ఇంక చాల రకాల కథల పుస్తకాలు, బాలల రామాయణం, మహాభారతం పుస్తకాలు.

అలానే 1-10 th క్లాస్ తెలుగు పుస్తకాలు పాతవి

ఇవి అన్ని వున్నాయి, కొత్తగా వచ్చినవాళ్ళు, తెలియని వాళ్ళు ఉంటే డౌన్లోడ్ చేసుకోండి. అలానే మీకు కావాల్సిన బుక్ ముందు సెర్చ్ చెయ్యండి, లేకుంటే అడగండి, ఉంటే నేను లేదా గ్రూప్ లో ఎవరో ఒకరు సెండ్ చేస్తారు. ధన్యవాదములు.

తెలియని వాళ్ళు వుంటారు అని ఓల్డ్ మెస్సేజ్ మల్లి ఫార్వర్డ్ చేశాను.

తెలియని వాళ్ళు ఉంటే సేవ్ చేసుకోండి

అందరు డౌన్లోడ్ చేసుకోని వినండి చాల బాగుంటుంది.వీటి కాస్ట్ 5000 - 10000 ఉంటుంది. ఎప్పుడైనా డిలీట్ చెయ్యొచ్చు అందరు save చేసుకోండి. ఈ భగవద్గీత 19 ఆడియో లు

https://youtube.com/shorts/Kdae-CkJ4B8?si=zODqpgR3iuYEudVt

☘️🍁 ఆప్తవాక్యాలు 🍁☘️

137. మా ఆపో మా ఓషధీహిగ్ం సీః... పృథివీం మా హిగ్ంసీః

జలములను, ఓషధులను, భూమిని హింసించవద్దు

ప్రకృతి వలననే సర్వజీవులు ఉనికిని పొంది ఉన్నాయి.

జీవనాధారమైన ప్రకృతిని - విచక్షణారహితంగా హింసించడం, విజ్ఞానం పెరిగిందనుకుంటున్న నేటి ఆధునిక కాలంలోనే అధికమౌతోంది. సుఖలాలసతో ప్రకృతి క్షేమాన్నీ, మానవ భవితవ్యాన్ని కూడా విస్మరిస్తున్నాం, ఈ అలక్ష్యధోరణి
మన దేశంలో మరీ మితిమీరుతోంది.

ఎన్నో గొప్ప క్షేత్రాలు, అరణ్యాలు, పర్వతాలు, నదులు, జలాశయాలు... ఇవన్నీ ఇప్పుడు మానవుడి దౌష్ట్యానికి గురై బాధింపబడుతున్నాయి. నిజానికి పర్యావరణం పట్ల దూరదృష్టి, భద్రతా దృక్పథం మొదటిగా చాటిన వేదసంస్కృతి మనది. ప్రకృతిలో పరమాత్మను దర్శించి ఆరాధించే ధార్మిక విధానాలను బోధించిన పరంపర మనకుంది. కానీ వాటిని విస్మరించి ప్రకృతిరూప ఈశ్వరునిపట్ల ద్రోహాన్ని చేస్తున్నాం.

హియాలయాలను మొదలుకొని గంగా యమునా గోదావరీ కావేరీ నదులతో
పాటు ఎన్నో వృక్షసంపదలకు ఆలవాలాలైన అరణ్యాలను కలుషితం చేసి, వాటి ఉనికిని ప్రశ్నార్థకం చేస్తున్నాం. 'పుణ్యం వస్తుంది' అనే ఆశతో తీర్థక్షేత్రాలను సేవించే
వారందరూ, పుణ్యస్వరూపాలైన ఆ ధామాలను పవిత్రంగా, శుభ్రంగా చూడలేక పోతున్నారు.

గంగాది తీర్థస్థలాల్లో గుంపులుగా చేరడం, ప్లాస్టిక్ పాత్రలలో నానా 'ఫాస్టుఫుడ్”లు ఆరగించి, ఎక్కడ పడితే అక్కడ ఆ పాత్రలను పారవేయడం జరుగుతోంది.

అందునా - దుర్గమమైన పర్వతాలకు, క్షేత్రాలకు ప్రయాణ సౌకర్యాలు పెరగడం, వాటిని ధనలబ్ధికోసం వాడుకొనే యాత్రా నిర్వాహకులు వృద్ధి చెందడం జరిగాక ఒక
వినోదయాత్రగా బయలుదేరుతున్న బాధ్యతారహితుల సంఖ్య కూడా పెరిగింది.

మనకి పర్యావరణ శాఖ, నదులను రక్షించే ప్రభుత్వ రంగసంస్థలు బాగానే ఉన్నాయి. కానీ పర్యావరణ పరిరక్షణ కాగితాల్లో, ప్రకటన పత్రాలలో తప్ప క్రియారూపంగా కనిపించడం లేదు.
విదేశాల నుండి ఆసక్తిగా వచ్చే పర్యాటకుల దృష్టిలో దేశం
పరువు పోతుందని కూడా అనిపించడం లేదు.

పేరుకు మాత్రం వివిధ పథకాలను, శాఖలను ఏర్పరచే ప్రభుత్వాధినేతలు, వాటి ద్వారా కూడా అవినీతి మార్గంలో వ్యక్తిగత ఆదాయాలను పెంచుకుంటున్నారే తప్ప
• ఏ మాత్రం క్రియాశీలంగా వ్యవహరించడం లేదు. పుణ్యం కోసం ప్రాకులాడే భారతీయులు కూడా ధర్మశాస్త్రాలు చెప్పే నియమాలను ఉల్లంఘించి, పాపాలను
మూటగట్టుకుంటున్నారు.

ఈ దేశంలో అతిపెద్ద సమస్యలు రెండు
1. నేతల అవినీతి 2. పర్యావరణ
కాలుష్యం, అపరిశుభ్రత. వీటిని యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించాలి.

ఇప్పటికే ఎన్నో ఓషధులను పోగొట్టుకున్నాం. కొన్ని నదులు అంతరించి పోతున్నాయి.
అరణ్యాలు ధ్వంసమౌతున్నాయి. తరువాతి తరాలకు భూమి ఎలా మిగులుతుంది?ఎటువంటి విషమపరిణామాలలో భవిష్యత్తరాలు బ్రతకవలసి వస్తుంది.. భక్తులు,
పుణ్యంపై ఆశ కలవారు ఎందరో ఉన్న దేశంలో వారికి వివేకం కలిగించాల్సిన
బాధ్యత ధార్మిక గురువులకు చాలా ఉంది.

శక్తి కలిగి, రోగాలను నాశనం చేసే ఓషధుల వృక్షాలు ఉన్న భూమి మనకి కావాలి

దున్నిన వెంటనే విత్తనాలు మొలకెత్తే పారవంతమైన భూమి కావాలి.

మేధావులు, శ్రమజీవులు, రక్షకులు, వాణిజ్యవేత్తలు నివసించే భూమి
కావాలి... అంటూ అథర్వణవేదం - భూమి ఎలా ఉండాలో వివరించింది.

ప్రవాహరూప జలాలు, బావులు, చెరువులు... మొదలైన జలాశయాల
ద్వారా జలదేవత మమ్మల్ని రక్షించాలి - అని ఋగ్వేదం బోధించింది.

నీరే ఔషధం అని వేదం మరోచోట ప్రవచించింది.

“ఆపో భవన్తు పీతయే” - తాగడానికి పనికివచ్చే శుద్ధజలాలు భూమిపై
ఉండాలని వేద ధర్మం బోధిస్తోంది. ఇప్పుడు అలాంటివి ఎక్కడ లభిస్తున్నాయి?

ప్రకృతి సంపద ఎలా ఉండాలో, ఎలా కాపాడాలో యుగాల నాడే బోధించిన
వేదభూమిలో, ప్రకృతిని పరిరక్షించుకోవడం కోసం ప్రతి భారతీయుడు ఉద్యమించాలి.
అటువంటి సద్బుద్ధిని భారతీయులకు ప్రసాదించమని భగవంతుని ప్రార్థిద్దాం.

☘️🍁 ఆప్తవాక్యాలు 🍁☘️

136. భక్తిం మయి పరాం కృత్వా

భక్తిని నా పరం చేయి(భగవద్గీత)

భగవంతుని ప్రేమస్వరూపంగా మన సంస్కృతి అభివర్ణించింది. 'ప్రేమరూపా ప్రియంకరీ' అని లలితా నామాలు. ప్రేమయే దైవస్వరూపం. సృష్టిలో జరిగే ప్రతిచర్యా ప్రియమైనదే. తత్కాలంగా అప్రియంగా కనబడినప్పటికీ దాని పరిణామం
ప్రియమే. ఈ దృష్టితో జీవితాన్నీ, ప్రపంచాన్నీ గ్రహించినట్లయితే అంతా ఆనందమే, ప్రశాంతతే.

ఈశ్వరుడు ప్రేమస్వరూపుడు కనుక, ఆయనని ప్రేమతోనే గ్రహించగలం.
కాంతిస్వరూపుడైన సూర్యుని... కాంతి సహాయంతోనే తెలుసుకున్నట్లుగా, ప్రేమయే భగవంతుని సాక్షాత్కరింపజేస్తుంది. భగవంతుడు జగతిపై కురిపించే ప్రేమకు 'కరుణ’
అని పేరు. మనం దైవంపై చూపించే ప్రేమకు 'భక్తి' అని పేరు. ప్రేమతోనే
ప్రేమస్వరూపుని గ్రహించాలి.

అందుకే భక్తిశాస్త్రాన్ని రచించిన నారదమహర్షి 'సాత్వస్మిన్ పరమ ప్రేమరూపా అమృత స్వరూపాచ' అని నిర్వచించాడు. సర్వవ్యాపకుడు, సర్వశక్తిమంతుడైన పరమేశ్వరునిపై సంపూర్ణమైన ప్రేమనే 'భక్తి' అని స్పష్టపరచాడు. అది ఆనందస్వరూపమని తీర్మానించాడు. భక్తి వలన ఆనందం కాదు. భక్తియే ఆనందం.

కామనాభక్తికి, ఈ ప్రేమభక్తికీ హస్తిమశకాంతరం ఉంది. కామం అడుగుతుంది.భక్తి అర్పిస్తుంది. ప్రేమ రసస్వరూపం. ఆ ప్రేమలో భక్తునికి భగవంతుడు తప్ప పట్టదు. వీచేగాలి భగవంతుని స్పర్శ. సూర్యచంద్రకాంతులు భగవంతుని
చూపులు. అంతా ఈశ్వరమయం.

ఈ భక్తిలో మునిగిన వారి నుండి కూడా ప్రేమయే ప్రసరిస్తుంది. ప్రేమకు
వ్యతిరేకమైన ద్వేషాలు, అసూయలు, హింసలు వగైరా అసురభావాలు ఇసుమంత కూడా కానరావు. కోరికలు కోసం దేబిరించే ఆశ్రయానికి ఈ భక్తిలో స్థానం లేదు.తన కోరిక కోసం భగవంతుని నమ్ముకున్నవారు - ముందుగా 'కోరికకి భక్తులు' అని తెలుసుకోవాలి.

‘భవతాత్ భక్తిః అహైతుకీ త్వయి' అంటారు చైతన్యమహాప్రభువు. ఏ నెపమూ లేని భక్తి లభించితే దానికంటే వేరే ముక్తి అంటూ లేదు. ధర్మార్థ కామమోక్షాల కంటే ఇది
శ్రేష్ఠమని, భక్తిని 'పంచమ పురుషార్థం'గా అభివర్ణించారు మధుసూదన సరస్వతి.

విశ్వంలో, మనలో నిరంతరం ప్రసరించే చైతన్యమంతా పరమాత్ముని కరుణయే.అంటే ప్రేమయే. ఆ ప్రేమ నిరంతరం విశ్వమంతా ప్రత్యణువునా ప్రసరిస్తోంది.

భగవచ్చింతన, కీర్తన, స్మరణ - ఇవన్నీ భక్తునికి ప్రేమలో భాగాలే. ఈ ప్రేమలో
కరిగి పుట్టిన మధురభక్తిలోనే - నాడు గోపికలు తరించారు. ఈ ప్రేమ చైతన్యాన్నే అన్నమయ్య, త్యాగయ్య, రామదాసు, మీరాబాయి, సూరదాస్, చైతన్యమహాప్రభువు మొదలైన వారంతా అమృతవాహినిగా ప్రవహింపజేశారు. ఈ ప్రేమభక్తినే 'అనన్యభక్తి,పరాభక్తి, ఏకభక్తి' అని భాగవతం, భగవద్గీత ప్రతిపాదించాయి.

'అణ్ బే శివమ్' - ప్రేమయే శివం
అని తమిళనాట శివభక్తుల నినాదం.ప్రేమయే శివస్వరూపం.

'పరమ ప్రేమ' అనే మాటను నారదుడు ప్రయోగించాడు. 'అత్యంత ఉత్కృష్టమైన'
(దానికి మించినది మరొకటి లేదు) అని అర్థం. ఉత్కృష్టమైన దానిని ఉత్కృష్టంగా ప్రేమించడమే భక్తి. పరమాత్మయే ఉత్కృష్టుడు. ఆయనని అనన్యంగా ప్రేమించడమే
ఉత్కృష్టత.

భగవంతుడు అందరివాడు. 'తనవాడు' అని గుర్తించిన ప్రేమి ధన్యుడు. ప్రేమమార్గం
రసయోగం. ఆ రససిద్ధులకు వందనాలు.

☘️🍁 ఆప్తవాక్యాలు 🍁☘️

135. ఉత్ అస్థామ్ అమృతాన్ అను

అమృతులను అనుసరించి ఉన్నతుడనౌదును గాక (యజుర్వేదం)

ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి వెళ్ళాలనేది ప్రతి జీవుని తపన. అందుకే పై మంత్రంలో తాము ఉన్నతులవ్వాలనే ఆకాంక్షతో పరమేశ్వరుని ప్రార్థిస్తున్నారు ఋషులు.

నాశనం లేనివారు అమృతులు. సద్గుణాల చేత, సత్కార్యాల చేత సత్కీర్తిని సాధించినవారు. వారిని అనుసరించితేనే మనం ఉన్నతస్థితిని చేరగలం.

"దుశ్చరిత్ర నుండి నేను బైట పడాలి" అని ఈ మంత్ర పూర్వ భాగంలోని
భావం. అంటే - సచ్చరిత్ర అలవడాలి అన్నా, చెడు నడత నుండి వెలువడాలన్నా ఆదర్శ పురుషుల్ని అనుసరించాలి... అనే ఆంతర్యాన్ని బోధిస్తున్నది వేదమాత.

అలాంటి అమృతచరిత్రలను అందించడానికే వాల్మీకి, వ్యాసాదులు ఇతిహాస పురాణాలను అందించారు. కాళిదాసాదులు సత్కావ్యాలను రచించారు.

( మన సంస్కృతిలో శాస్త్రాలు అసంఖ్యాకాలు. అదే విధంగా ఆచరించి నెగ్గిన మహాత్ములూ అసంఖ్యాకులే. ఈ సనాతనధర్మం ఇంకా నిలబడిందీ అంటే పుస్తకాలో, సంస్థలో, ప్రచారాలో కారణాలు కావు. ధర్మానికి నిలువెత్తు నిదర్శనాలైన మహాపురుషులే నిజమైన ఆధారాలు.)

ఉత్తమమైన 'చరిత్ర' (నడత) కలిగినవారే అమరులు. వారు భౌతికంగా లేకున్నా,వారి గుణగణాలు మనకు స్ఫూర్తినిచ్చి మన నడవడికను తీర్చిదిద్దుతాయి.

“మహాత్మా యేన గతః సపంథా" - అని మహాభారతం. మహాత్ములు ఏ దారిన
వెళ్ళారో, దానినే అనుసరించు... ఇదే పెద్ద ధర్మం. కర్తవ్యాకర్తవ్య విచారణలో శాస్త్రాలను అనుసరించడం ఉత్తమం.

'తస్మాత్ శాస్త్రం ప్రమాణం తే' - అని పలికిన శ్రీకృష్ణుడు 'యద్యదాచరతి శ్రేష్ఠఃతత్త దేవేతరోజనాః' శ్రేష్ఠుడు దేనిని ఆచరిస్తాడో ఇతరులు దానిని అనుసరిస్తారు.. అని కూడా వివరించాడు.

శాస్త్రాలు గొప్పవే, కానీ అవి అనేకాలు. ఏది దేనికి అనుసంధించాలో, దేనిని
ఎలా అర్థం చేసుకోవాలో తేల్చుకోవడం కష్టం. పరస్పర విరుద్ధాలుగా కనిపించే
వాటిని ఎలా సమన్వయ పరచుకోవాలో అర్థం కాదు.

అందుకే 'శిష్టాచారం' అనేది ధర్మంలో ప్రధానమయింది. 'శిష్టులు' అనగా “కపటం లేకుండా, సత్ప్రవర్తన కలిగిన శుద్ధ మనస్కులు” అనేది ప్రధాన నిర్వచనం. వారే అమృతులు.

అసలు వారి ద్వారానే ధర్మం యొక్క 'ఆచరణీయత' తేటపడుతుంది. ఎలాంటి ప్రతికూల పరిస్థితుల్లో, ఎటువంటి ధోరణిలో వారు ధర్మాన్ని కాపాడుకున్నారో,చరిత్రను నిలబెట్టుకున్నారో అధ్యయనం చేయాలి అన్వయించుకోవాలి
అనుసరించాలి.
-
మన సంస్కృతిలో శాస్త్రాలు అసంఖ్యాకాలు. అదే విధంగా ఆచరించి నెగ్గిన మహాత్ములూ అసంఖ్యాకులే. ఈ సనాతనధర్మం ఇంకా నిలబడిందీ అంటే పుస్తకాలో,
సంస్థలో, ప్రచారాలో కారణాలు కావు. ధర్మానికి నిలువెత్తు నిదర్శనాలైన మహాపురుషులే నిజమైన ఆధారాలు.

ఎలాంటి కాలాల్లో లైనాఎప్పటికప్పుడు మణిదీపాల్లాంటి మహాత్ములు ఈ భరతభూమిపై ఆవిర్భవిస్తున్నారు.
అవతారపురుషులు, కారణజన్ములు, సిద్ధులు, యోగులు, మహర్షులు... ఇలాంటి అమృతస్వరూపులు మన సంస్కృతి పరంపరలో ఎందరో.

వారే మనలను 'ఉత్’'సాహ పరచి, 'ఉత్'కృష్ట స్థితికి తీసుకువెళ్ళి ఉత్తమ గతిని కలిగిస్తారు.

☘️🍁 ఆప్తవాక్యాలు 🍁☘️

134. ... ఏష ధర్మస్సనాతనః

ఇది సనాతనధర్మం (స్కృతివాక్యం)

ఈ వాక్యం మన పురాణేతిహాసాలలో మాటిమాటికీ ధ్వనించే మాట. ' ఇది
సనాతనధర్మం' అనే మాటకి చెల్లుబాటు. పురాతనంగా కనిపించినా నిత్యనూతనమైనది సనాతనం. కాల పరిధులకి లొంగని శాశ్వతధర్మం సనాతనం. సూర్యోదయ,
చక్రోదయాల వలె నిత్యనూతనమది. నిత్యజ్ఞానం సనాతనం.

' ధారణాద్ధర్మమిత్యాహుః'-అని నిర్వచనం. ధరించునది ధర్మం. వృక్షానికి పాదు ధారణం. దాని వలన వృక్షం నిలుస్తుంది-బ్రతుకుతుంది-ఎదుగుతుంది. అలాగే జీవన వృక్షానికి పాదు ' ధర్మం'. మానవ జీవనానికి సార్ధకతను కల్పించడానికై ధర్మాన్ని ప్రబోధించిన ప్రథమ వాఙ్మయం వేదం. అందుకే ' వేదో ... ఖిల ధర్మమూలమ్' అని
సర్వశాస్త్రాలు శిరసావహించాయి. అవశ్యం అనుసరించ వలసిన వాక్యాన్ని ' వేదవాక్కు' అనడం నానుడి.

ప్రత్యక్షేశానుమిత్యేవ యస్తూపాయంన బుద్ధ్యతే!
యేనం విష్ణన్తి వేదేన తస్మాత్ వేదస్య వేడతా

మహర్షుల తపోజనితమైన అనంత విజ్ఞానరాశి వేదం. ఆ వేదధర్మాన్ని జీవన
వ్యవహారంలోనికి తీసుకువచ్చి, సర్వజనులు అవలంబించేటట్లుగా ప్రబోధించినవి స్మృతులు, పురాణాలు, ఇతిహాసాలు.

భౌతిక ప్రత్యక్షవాదం శాశ్వత సత్యాన్ని ప్రతిపాదించలేదు. అతీన్రియ తపోదృష్టికే
పరమార్థం తనను తాను ప్రత్యక్షం చేసుకుంటుంది. ఆ పరమార్థ శాస్త్రమే వేదవిజ్ఞానం. ఇది తపస్సిద్ధమైన అతీన్టియశక్తికి వినబడిన దివ్యశబ్దం కనుక ' శ్రుతి' అని వ్యవహారం.
ఈ శ్రుతి చెప్పిన ధర్మాలను ఆయా దేశకాలాలకు అనుగుణంగా ' స్మరించి' చెప్పేది స్మృతి. ఈ స్మృతులు ఆయా కాలాలలో ఋషులు, ఋషికల్పులు ఏర్పరచినవి.వీటినే ' ధర్మశాస్త్రాలు' అంటారు.

అటు తరువాత అష్టాదశపురాణ విద్య. వీటితో పాటు ఇతిహాసాలు. ' ఇతి-హా-అసమ్'= ఇతిహాసమ్ ' = ఇలా జరిగింది కదా' అని ఈ మాటకి అర్థం. అంటే-జరిగిన వాటినే ఇతిహాసంలో చెప్పారు అని స్పష్టమౌతుంది. ఇతిహాసాలు ప్రధానంగా రెండు.

1. రామాయణం, 2. మహాభారతం.

ఇందులో వాల్మీకి రచించిన రామాయణంకావ్య సంప్రదాయాన్ని అనుసరించిన ఇతిహాసం.

మహాభారతం-పురాణ, స్మృతి
సంప్రదాయాలతో పాటు కావ్యలక్షణాలను మేళవించుకున్న మహేతిహాసం.

' సనాతనధర్మం' అనేది ఈ వాఙ్మయాలలో విస్తృతంగా అందించబడినది. తేలిన
-ధర్మమనే దానికి ప్రధానాధారం.-శ్రుతి, స్మృతి, పురాణ, ఇతిహాసాలు.

' శ్రుతి, స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం' అంటూ మనం ఆచార్య
దేవుని నమస్కరిస్తాం. శ్రుతిస్కృతి పురాణ ధర్మాలను బోధించేవాడే ఆచార్యుడని దీని భావం.

ఇతిహాస పురాణాభ్యాం వేదం సముపబృంహయేత్ |
బిభేత్యల్పశ్రుతాత్ వేదో మామయం ప్రహరిష్యతి ।।

" ఇతిహాస పురాణాల ద్వారా వేదధర్మం వ్యాపకంగా తెలియబడుతుంది. ఈ
పురాణాది జ్ఞానం లేనివాడు వేదానికి చెబితే వేదమాత భయపడుతుంది-
తనను సరిగా అర్ధం చేసేకోలేడని."

ఈ వేదాది వాఙ్మయంతో పాటు, నిస్స్వార్ధపరులైన మహాత్ముల ధర్మబద్ధ జీవనం కూడా సనాతనధర్మానికి ఆలంబన.

' మహాత్మా ఏన గతః సపంథా'- మహాత్ములు నడచినదే మన త్రోవ. విస్తారమైన ధర్మాన్ని జీవితంలో ఆచరించి చూపినవారే మహాత్ములు. మన భారతీయ ధార్మిక జీవనం అటు వేదపురాణాది గ్రంథాల ద్వారాను, మహాత్ముల ఆదర్శమయ జీవనంతోనే
పటిష్టమై మనలను నడిపిస్తోంది.