👆 చంద్రగిరి శ్రీ కోదండరామాలయంలో పవిత్రోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ
తిరుపతి, 2024 అక్టోబరు 21: చంద్రగిరి శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో అక్టోబరు 22 నుండి 24వ తేదీ వరకు జరుగనున్న పవిత్రోత్సవాలకు సోమవారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించారు. ఇందులో భాగంగా సాయంత్రం 6 నుండి సేనాధిపతి ఉత్సవం, మృత్సంగ్రహణం, రక్షాబంధనం, మేదినిపూజ, తదితర కార్యక్రమాలు నిర్వహించారు.
ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో తెలియక దోషాలు జరుగుతుంటాయి. వీటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా ఆగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు.
అక్టోబరు 22వ తేదీ మంగళవారం ఉదయం చతుష్టానార్చన, పవిత్రప్రతిష్ఠ, సాయంత్రం పవిత్ర హోమాలు జరుగనున్నాయి. అక్టోబరు 23న బుధవారం ఉదయం పవిత్ర సమర్పణ, హోమాలు, సాయంత్రం పవిత్ర హవనం, చతుష్టానార్చన కార్యక్రమాలు నిర్వహిస్తారు. అక్టోబరు 24న గురువారం ఉదయం పవిత్ర విసర్జన, కుంభప్రోక్షణ, సాయంత్రం వీధి ఉత్సవం జరుగనున్నాయి.
గృహస్తులు(ఇద్దరు) రూ.200/- చెల్లించి పవిత్రోత్సవాల ఆర్జితసేవలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక పవిత్రమాల, తీర్థప్రసాదం బహుమానంగా అందజేస్తారు.
ఈ కార్యక్రమంలో టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ ముని హరిబాబు, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.